బొంగులో వార్త:
ఆఫ్ఘని స్తాన్లో ఆత్మాహుతి బాంబర్ల మృతదేహాలు, ఛిద్రమైన శరీర భాగాలతో ఫోజులిచ్చిన అమెరికా సైనికుల ఫొటోలను లాస్ ఏంజెల్స్ టైమ్స్ బుధవారం ఉదయం ప్రచురించింది. వాటిని అక్కడ పని చేసి వచ్చిన ఒక అమెరికా సైనికుడు ఆ పత్రికకు విడుదల చేశారు. ఆయన తన పేరును వెల్లడించగూడదనే షరతుపై ఆ ఫొటోలను అందజేశారు. 'అక్కడ నాయకత్వం, క్రమశిక్షణ కుప్పకూలిందని చెప్పేందుకే వాటిని విడుదల చేశాను. తద్వారా సైనికుల భద్రత విషయంలో రాజీపడ్డారు' అని ఆయన చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఉగ్రవాదులు తమ సొంత పేలుడు పదార్థాలతోనే మరణించినందుకు తన తోటి సైనికులు ఒక రకమైన విజయగర్వాన్ని పొందినట్లు ఆయన ఆ పత్రికకు చెప్పారు. 'వారు చాలా నిస్పృహతో ఉన్నారు. అందువల్ల ఉగ్రవాదులు మరణించడాన్ని ఒక సంతోషకర సందర్భంగా జరుపుకున్నారు' అని పేర్కొన్నారు. అమెరికా సైనికులు ఆఫ్ఘన్ల ప్రాణాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదనడానికి ఇది ఏకైక ఉదాహరణ కాదని ఆ పత్రిక తెలిపింది. 'నలుగురు అమెరికా సైనికులు ఆఫ్ఘన్ల మృతదేహాలపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు చూపుతున్న వీడియో గత జనవరిలో ఇంటర్నెట్లో దర్శనమిచ్చింది. ఫిబ్రవరిలో అమెరికా సైనికులు తమ స్థావరంలో ఖురాన్ ప్రతులను దగ్ధం చేయడంతో చెలరేగిన అల్లర్లలో 30 మంది ఆఫ్ఘన్లు, ఆరుగురు అమెరికా సైనికులు మృతి చెందారు. గత మార్చిలో ఒక అమెరికా సైనిక సార్జెంట్ రెండు గ్రామాలపై ఉన్మాదిలా జరిపిన కాల్పుల్లో 17 మంది మృతి చెందారు' అని ఆ పత్రిక పేర్కొంది. తనకు లభ్యమైన 18 ఫొటోల్లో ఏ ఒక్కదాన్నీ ప్రచురించవద్దని అమెరికా సైన్యం లాస్ ఏంజెల్స్ టైమ్స్ పత్రికను కోరింది. అయితే బాగా పరిశీలించిన మీదట కొన్ని ఫొటోలను మాత్రం ముద్రించాలని నిర్ణయించినట్లు ఆ పత్రిక సంపాదకుడు దావన్ మహరాజ్ చెప్పారు. కాగా ఈ సంఘటనలపై అమెరికా సైనిక దర్యాప్తు ప్రారంభించింది.
No comments:
Post a Comment